Wednesday, May 14, 2008

మనసున మనసై - II (కథ)

ఆరు నెలలు గడిచేసరికి, ప్రతిఫలాలు ఆశించని పరిచయాల పరిమళాలు ఇద్దరి మనసులని అందంగా అల్లుకున్నాయి. ఇద్దరూ అభిప్రాయాలు పంచుకుని, అభిరుచులు తెల్సుకుని, ఒకరి మీద ఒకరికి అభిమానం ఒక బంధంగా మారబోయే సమయానికి,కీర్తికి అనుకోకుండా ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ హైదరాబాదులో చేసే అవకాశం వచ్చింది.కంగారు కంగారుగా అంజలి వాళ్ళింటికి వెళ్ళి విషయం చెప్పి,వాళ్ళూరు వెళ్ళి ఓ వారం అక్కడే వుండి, అట్నుంచి అటే భాగ్యనగరం బస్ ఎక్కేసింది. ఇంత హడావిడిలో రఘుకి చెప్పలేకపోయినందుకు కీర్తికి మనసు పీకుతూనే వుంది.

కీర్తికి హైదరాబాదు వచ్చాక కూడా జీవితంలో చాలా విలువైనది ఏదో కోల్పోయిన భావం వెంటాడుతూనే వుంది. రఘు ఎప్పుడూ తన పక్కనే వుంటే బావుంటుంది అని అనిపించింది.అలా అతనికై పడే ఆరాటం, పెంచుకున్న అనురాగం మనసుని మీటే ప్రతిసారీ, భవిష్యత్తు గురించి కోటి సందేహాలు చుట్టుముట్టేవి. "నలుగురూ నడిచే దారి నాకొద్దు అంటూ తనదైన బాటలో సాగే రఘుతో తను కలిసి నడవగలదా..? ఒకవేల రఘుకి సివిల్స్ రాకపొతే, అతను అన్నట్టుగానే లెక్కల మాస్టారిగా స్థిరపడిపోతే అప్పుడు పరిస్థితేంటి..? రేప్పొద్దున్న ఫ్రెండ్స్ అంతా గొప్ప గొప్ప పొజిషన్లో వుండి, బాగా సంపాదిస్తుంటే తను మాత్రం రఘుతో సాదా జీవితం, జీతంతో ఆనందంగా వుండగలదా..? దేనికీ అవును అనే సమాధానం ఖచ్చితంగా రాలేదు. దాంతో కీర్తి తన మనసుకి రఘు కథ కమ్మని జ్ఞాపకం అని నచ్చచెప్పటం మొదలుపెట్టింది. నెమ్మదిగా ప్రాజెక్ట్ గోలలో, జాబు వేటలో ఆ ఆలోచనలు మరుగునపడిపోయాయి.

కీర్తి ఆకస్మిక అదృశ్యం, రఘు గుండెల్లో ఆందోళనని,ఆవేదనని,ఆరాటాన్ని కలిపి రేపింది.ఎందుకు రావట్లేదో తెలీదు.ఏమి అయ్యిందో తెలీదు. కాసింత కంగారు, మరికొంత అసహనం. పోనీ ఎదురింటి వాళ్ళని డైరెక్టుగా అడుగుదామంటే, ఏమి అనుకుంటారో అని సందేహం. చివరకి ధైర్యం చేసి తను ట్యూషన్ చెప్పే అబ్బాయి చేత అంజలిని అడిగించాడు. అప్పుడు తెల్సింది కీర్తి ప్రాజెక్ట్ విషయం. చెప్పనందుకు మొదట కోపం వచ్చింది. మళ్ళీ తనకే అనిపించింది. కీర్తికి తను ఏమవుతాడని చెప్పాలి. ఒక పేరంటూ లేని పరిచయంలో అడిగే హక్కు తనకు లేదు. చెప్పాల్సిన బాధ్యత కీర్తికి అస్సలు లేదు అని గొప్పగా అనుకోడమైతే అనుకున్నాడు కానీ అదింకా భాధగా అనిపించింది.రోజూ నడిచే దారిలో, ఒక్కడే నడుస్తుంటే ప్రతి అడుగుకో జ్ఞాపకం పలకరిస్తూ కీర్తిని పదే పదే గుర్తు చేస్తుంటే భరించలేక వేరే దారిలో రావడం మొదలుపెట్టాడు.
*******
మూడేళ్ళు గడిచేసరికి కీర్తి చేతిలో మంచి ఉద్యోగం,కావాల్సినంత జీతం, కోరుకున్న జీవితం, దానితో పాటే అప్పుడప్పుడు గడిచిన అందమైన రోజుల్ని గుర్తు తెచ్చి, గుచ్చి గుచ్చ్చి వేధించి సాధించే ఒంటరితనం.స్నేహితులు అంతా పుట్టకొకరు, చెట్టుకొకరు అయిపోయారు. తనతో పని చేసే వాళ్ళంతా ఎవరికి యమునా తీరే అన్నట్టు వుంటారు.

అలా ఒంటరితం వేధించినపుడు,ఎడారిలో బ్రతుకున్నట్టు అనిపించినపుడు , తన అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, అభద్రతా భావాల్ని తన కోణంలోంచి చూడగలిగే మనిషి, తన నిశ్శబ్దాన్ని, మూర్ఖత్వాన్ని, పిరికితనాన్ని అర్థం చేసుకునే మనసు కావాలని కీర్తికి బాగా అనిపించేది. బ్రతుకులో కష్టం,మనసులో వెలితి నిజమైన స్నేహాల విలువ తెలిసేలా చేస్తాయేమో.అందుకే అలా అనిపించినప్పుడల్లా ఎంతో కాలంగా పరిచయమైన స్నేహితులు, పక్కనే వున్న కొలీగ్స్ అందర్నీ దాటి చిత్రంగా కీర్తి ఆలోచన మళ్ళీ మళ్ళీ రఘు దగ్గరకే వెళ్ళి ఆగేది.

పదే పదే రఘు దగ్గరకే వెళ్ళి ఆగిన ఆ ఆలోచన, మొదట చిన్న అభిలాషై, నెమ్మదిగా ఆశగా మారి, క్రమంగా విడదీయలేనంత గాఢంగా మనసంతా అల్లుకుని, కీర్తి శ్వాసలో భాగం అయిపోయింది.రఘుతో జీవితం పంచుకుంటే, అరువు తెచ్చుకున్న ఆశలు, కలలు కరిగిపోయి, కీర్తి కీర్తిలానే వుండగలుగుతుందన్న భావం, దూరం అయిన మూడేళ్ళ తర్వాత కీర్తిని రఘుకి బాగా దగ్గర చెసింది.కానీ కీర్తికి ఒకటే సందేహం. "రఘు కూడా తన గురించి ఇలానే ఆలోచిస్తున్నాడా..? లేక నా ఆలోచనలకి, ఆశయాలకి కీర్తి సరిపడదు అనుకుని పూర్తిగా మర్చిపోయాడా..?".
*******

No comments: